ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నగర వనం పేరిట ఆన్ లైన్ లో వర్ట్యువల్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నది. జూన్ ఐదవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలనుంచి గంట పది నిముషాల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణం మార్పుల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రకాష్ జవదేకర్ ముఖ్యఅతిథిగా, సహాయమంత్రి శ్రీ బాబుల్ సుప్రియో గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించడానికి https://www.youtube.com/channel/UCCl94zd6YfuUrv9DJz_5RcA లింక్ కు కనెక్ట్ కావాలి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ దళాధిపతి, ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి శ్రీ ఎన్ ప్రతీప్ కుమార్ అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. ఈ వర్ట్యువల్ సెలబ్రేషన్ ను కనీసం లక్ష మంది ప్రత్యక్షంగా వీక్షించేలా దోహదపడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. ఇందుకోసం ఈ కార్యక్రమ వివరాలను రేంజి స్థాయి వరకూ అటవీ సిబ్బంది , మ్యునిసిపల్ అధికారులు, కాలుష్య నివారణ బోర్డులు, స్వచ్చంద సంస్థలు , పరిశ్రమల నిర్వాహకులు .. ఇలా అందరికీ తెలియపర్చాలని శ్రీ ప్రతీప్ కుమార్ కోరారు. (IRA NEWSPAPER)